నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ మల్టీస్టారర్ కొల్లగొట్టే రికార్డులను బ్రేక్ చేయాలంటే తర్వాతి సినిమాలకు చాలా కష్టతరం అవుతుంది. ఇంత సత్తా ఉన్న ఈ మల్టీస్టారర్ అసలు రూపుదిద్దుకునే అవకాశం ఉందా... ఈ ఇద్దరితో మల్టీస్టారర్ ని ప్లాన్ చేసి తెరపై ఆవిష్కరించగల సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరు... అసలు ఏ డైరెక్టర్ అయినా ప్రయత్నిస్తాడా అనే ఆలోచనలు రాకమానవు. అయితే ఈ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ని వర్కవుట్ చేయడానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారమ్.
14 రీల్స్ సంస్థతో మహేష్ బాబుకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యానర్ లో 'దూకుడు', '1 నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలు చేసాడు మహేష్ బాబు. కాగా ఈ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్ధంగా ఉన్నాడట. ఇదే బ్యానర్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో 'లెజెండ్' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం రూపొందింది. ఈ నేపధ్యంలో బాలయ్య, మహేష్ బాబుతో మల్టీస్టారర్ చేయడానికి ఈ సంస్థ అధినేతలు ఆసక్తిగా ఉన్నారట. బోయపాటి శ్రీను కూడా ఈ ఇద్దరి హీరోలను ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నాడట. ఇందుకోసం ఓ కథ కూడా రెడీ చేస్తున్నాడట. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మాములుగా ఉండదు. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. మరి బోయపాటి ఈ కాంబినేషన్ ని సెట్ చేస్తాడా... వేచి చూద్దాం.