'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారు. 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' జీవితాన్ని ఆధారంగా తీసుకుని పరుచూరి బ్రదర్స్ ఓ స్ర్కిఫ్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చేయడానికి చిరు పచ్చజెండా ఊపేసారని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించనున్నాడు. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి హీరోయిన్ ని ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయట.
ఈ సినిమా కోసం అనుష్కను హీరోయిన్ గా తీసుకునే దిశగా చర్చలు జరిగాయట, అయితే 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం విడుదల తర్వాత అనుష్క లుక్ గురించి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. లావుగా కనిపిస్తోంది. 'బాహుబలి 2' చిత్రంలో కూడా అనుష్క కొన్ని సీన్స్ లో లావుగానే కనిపించనుందట. 'సైజ్ జీరో' చిత్రం కోసం బరువు పెరిగిన అనుష్క, ఆ తర్వాత బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు, ఇంకా లావుగానే ఉంది. ఈ నేపధ్యంలో అనుష్కను చిరు 151వ చిత్రం కోసం తీసుకోవడానికి వెనుకడుగు వేసారట.
తాజా వార్తల ప్రకారం శృతిహాసన్ ని తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. రాంచరణ్ 'ఎవడు' చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ ల సరసన శృతిహాసన్ నటించేసింది. ఇప్పుడు చిరుతో కూడా రొమాన్స్ కి అంగీకరిస్తే.. మొత్తం మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలతో జత కట్టిన హీరోయిన్ గా శృతిహాసన్ పేరు నమోదవుతుంది.