మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ చిరులో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. పెద్ద గ్యాప్ తీసుకోకుండా తదుపరి సినిమా చేయడానికి చిరు సమాయత్తమవుతున్నారు.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు ఉన్నాయి. రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి సంగీత దర్శకుడిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 'ఖైదీ నెంబర్ 150' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలందించాడు. కానీ చిరు 151వ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం దేవికి దక్కలేదని సమాచారమ్. 'ధృవ' చిత్రానికి సంగీతమందించిన హిప్ హాప్ తమిళా కి ఈ అవకాశం దక్కిందని తెలుస్తోంది. 'ధృవ' పాటలు విపరీతమైన ఆదరణ పొందాయి. ఈ నేపధ్యంలో రాంచరణ్ ఓటు హిప్ హాప్ తమిళాకి పడినట్టు తెలుస్తోంది. 151వ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించబోతున్నాడు. మరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూద్దాం. రాంచరణ్ ఈ సంగీత దర్శకుడికి ఓటేసాడు కాబట్టి, చిరు కూడా ఈ సంగీత దర్శకుడికే గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో వేచి చూద్దాం.