యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున్నాడు. ఈ సినిమా చివరి దశలో ఉన్నప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తను నటించబోతున్న చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడట. మరో ప్రాజెక్ట్ ని కూడా ఫైనలైజ్ చేసే దిశగా ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్ ల తర్వాత ఎన్టీఆర్ మూడేళ్ల పాటు పబ్లిక్ కి దూరంగా ఉండబోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా...
తనకు 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి హిట్ చిత్రాలు ఇచ్చిన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ భారీ సినిమా చేయబోతున్నాడు. 'బాహుబలి' రెండో భాగం తర్వాత రాజమౌళి 'గరుడ' టైటిల్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అయ్యే బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలని సమాచారం. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటింపజేయబోతున్నారట రాజమౌళి. 2017లో ఎన్టీఆర్ పుట్టినరోజునాడు (మార్చి 20) ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరపడానికి ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 3 యేళ్లు డేట్స్ కేటాయించాడట. అన్ని వర్కవుట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళితే ఆ మూడేళ్లు ఎన్టీఆర్ పబ్లిక్ లో కనిపించడు.
'బాహుబలి' ఫస్ట్ పార్ట్ కోసం ప్రభాస్ 3 యేళ్లు పబ్లిక్ లో కనబడలేదు. ఇప్పుడు రెండో పార్ట్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరో యేడాది పాటు ప్రభాస్ పబ్లిక్ కి దర్శనమివ్వడు. సేమ్ టు సేమ్ ఇలాగే ఎన్టీఆర్ కూడా 'గరుడ' షూటింగ్ సమయంలో పబ్లిక్ కి దూరంగా ఉండబోతున్నాడట. ఇది ఎన్టీఆర్ అబిమానులను నిరాశపరిచే విషయమే అయినా.. ఎన్టీఆర్ రేంజ్ ని అమాంతం పెంచే సినిమా కాబట్టి అభిమానులు ఈ ప్రాజెక్ట్ చేయడం పట్ల సంతోషిస్తారు. మరి రాజమౌళి ప్లాన్ చేస్తున్న ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూద్దాం.