సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి రవిరాజా తనయుడు ఆదికి ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఏ సినిమా పడితే ఆ సినిమా అంగీకరించకూడదనే ఆలోచనతో వస్తున్న ప్రతి ఆఫర్ ని ఆది అంగీకరించడంలేదు. సెలక్టివ్ గా సినిమాలు అంగీకరిస్తున్నాడు. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న 'బాగమతి' చిత్రంలో ఆది కీలక పాత్ర చేయడానికి అంగీకరించాడు. నాని హీరోగా నటించబోతున్న ఓ సినిమా కోసం ఆది పినిశెట్టిని విలన్ గా తీసుకున్నారు. తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి విలన్ అవ్వడానికి ఆది అంగీకరించాడని తెలుస్తోంది.
సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'విన్నర్' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం ఆది పినిశెట్టిని విలన్ గా తీసుకున్నారని సమాచారమ్. క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఆది అంగీకరించాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ 'సరైనోడు' టాలీవుడ్ లో ఆది కెరియర్ కి మంచి మలుపు అయ్యింది. మరోసారి మెగా కాంపౌండ్ హీరోకి విలన్ అవ్వబోతున్నాడు ఆది. మరి ఈ సినిమా ఏ మేరకు ఆదికి కలిసొస్తుందో వేచి చూద్దాం.