విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హీరోగా రూపొందిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరీ' చిత్రాలు. ఈ రెండు సినిమాలకు కథ, డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించాడు. విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాలు రూపొందాయి. హ్యుమరస్ టచ్ తో కూడుకున్న హీరో క్యారెక్టరైజేషన్, ఈ రెండు చిత్రాల కథలు, డైలాగ్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలు కనెక్ట్ అయ్యాయి. వెంకీ కెరియర్ లో ఈ సినిమాలకు ప్రత్యేకమైన స్థానం లభించింది. వెంకీ హీరోగా రూపొందిప 'వాసు' చిత్రానికి కూడా త్రివిక్రమ్ డైలాగులు అందించాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు వెంకటేష్. హారిక హాసిని క్రియేషన్స్ పై ఈ చిత్రం రూపొందనుంది. ఇది హిందీ సినిమాకి రీమేక్ అని సమాచారమ్.
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన 'జాలి ఎల్ ఎల్ బి 2' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ దక్కించుకున్నారు. ఈ బ్యానర్ లో, 'జాలి ఎల్ ఎల్ బి 2' రీమేక్ లో నటించడానికి అంగీకరించిన వెంకటేష్, ఖచ్చితంగా త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాలని కోరాడట. ఇందుకు త్రివిక్రమ్ కూడా అంగీకరించడంతోనే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందని సమాచారమ్.
'జాలి ఎల్ ఎల్ బి 2' లో జూనియర్ లాయర్ అయిన హీరో ఓ కేసును టేకప్ చేసి కోర్టులో వాదించి పోలీసులకు సైతం శిక్ష పడేలా చేస్తాడు. కామెడీ తో పాటు ఆలోచింపజేసే విధంగా కోర్టులో సాగే హీరో వాదన, కేసులో విజయం సాధించడానికి సేకరించే సాక్ష్యాలతో చాలా ఆసక్తికరంగా ఈ సినిమా ఉంటుంది. వెంకీ ఈ పాత్రను ఇరగదీస్తాడు. దానికి తోడు త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వం అంటే ఈ సినిమా వెంకీ కెరీయర్ లో మరో ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పొచ్చు. వచ్చే యేడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.