నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు దూసుకెళుతున్న విషయం తెలిసిందే. వసూళ్ల పరంగా విజృంభిస్తున్న ఈ చిత్రం గల్ఫ్ దేశాల్లో ఓ వారం లేటుగా ఇప్పుడు విడుదలయ్యింది. 'ఖైదీ నెం.150 చిత్రం జనవరి 11న విడుదలవ్వడంతో 'గౌతమిపుత్ర శాతకర్ణి' కి గల్ఫ్ లో ధియేటర్స్ దొరకలేదు. 'ఖైదీ నెం.150' హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాని ధియేటర్స్ నుంచి తీసేయలేక ఓ వారం పాటు ధియేటర్స్ కేటాయించారు. గల్ఫ్ లో ధియేటర్స్ కొరత ఉంటుంది. అక్కడ తెలుగు సంఘాల వారు రంగంలోకి దిగి ఈ వారం 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టారట. అలా ఓ వారం లేటుగా అక్కడ విడుదలయ్యింది 'శాతకర్ణి'.
కాగా ఓ వారం తర్వాత ఇప్పుడు 'గౌతమిపుత్ర శాతకర్ణి' అక్కడ విడుదలవ్వడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని చూడటానికి ఎగబడుతున్నారట. సినిమాకి హిట్ టాక్ రావడంతో అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఆరంభమవ్వగానే వెంటనే టిక్కెట్స్ సేల్స్ అయిపోయాయట. అక్కడ కూడా 'గౌతమిపుత్ర శాతకర్ణి' భారీగా వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే వసూళ్ల పరంగా విజృంభిస్తూ, పంపిణీ చేసిన వారందరూ లాభాల బాట పట్టేలా చేసిందీ సినిమా. ఇక ఇప్పుడు గల్ఫ్ లో కూడా తన సత్తా చాటుకుంటుందని ఊహించవచ్చు.