మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను కురిపిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ చిరులో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. పెద్ద గ్యాప్ తీసుకోకుండా తదుపరి సినిమా చేయడానికి చిరు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.
'ధృవ' చిత్రం జరుగుతున్న సమయంలోనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ స్టోరీ లైన్ ని చిరుకి వినిపించాడట. ఆ స్టోరీ లైన్ చిరుకి నచ్చి డెవలప్ చేయమని చెప్పారట. ఈ మధ్య డెవలప్ చేసిన స్టోరీ లైన్ ని చిరుకి వినిపించాడట సురేందర్ రెడ్డి. స్టోరీని డెవలప్ చేసిన విధానం చిరుని ఫుల్లుగా ఇంప్రెస్ చేసిందట. దాంతో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట చిరు. ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్ వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ రంగంలోకి దిగి స్ర్కిఫ్ట్ కి ఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు డైలాగులు సమకూర్చుతున్నారట. మార్చిలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టేయాలని ఫిక్స్ అయ్యారట.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి సంగీత దర్శకుడిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 'ఖైదీ నెంబర్ 150' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలందించాడు. కానీ చిరు 151వ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం దేవికి దక్కలేదని సమాచారమ్. 'ధృవ' చిత్రానికి సంగీతమందించిన హిప్ హాప్ తమిళా కి ఈ అవకాశం దక్కిందని తెలుస్తోంది. 'ధృవ' పాటలు విపరీతమైన ఆదరణ పొందాయి. ఈ నేపధ్యంలో రాంచరణ్ ఓటు హిప్ హాప్ తమిళాకి పడ్డట్టు సమాచారమ్. చిరు 151వ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించబోతున్నాడు. మరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూద్దాం.