స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం 'బాహుబలి' అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్... ఇలా భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచింది. దీని సీక్వెల్ గా రూపొందిన 'బాహుబలి ది కంక్య్లూజన్' రేపు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలవుతోంది. కాగా ఫస్ట్ పార్ట్ లో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపాడనే క్య్లూ ఇచ్చి వదిలేసాడు రాజమౌళి. అప్పట్నుంచి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే పశ్నకు ఎవరికి తోచిన విధంగా వారు సమాధానం చెబుతున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటీ అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. దీనికి సంబంధించి కట్టప్ప పాత్ర పోషించిన నటుడు సత్యరాజ్ దగ్గర అడిగితే... నవ్వుతూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదుగానీ, 'బాహుబలి 2* ఎలా ఉంటుందనే దానిపై స్పందించారు.
''బాహుబలి' లో కంటే నా పాత్ర నిడివి 'బాహుబలి 2' లో ఎక్కువగా ఉంటుంది. చాలా క్రూషియల్ క్యారెక్టర్ నాది. ఓ నటుడికి ఇలాంటి పాత్రలు దొరకడం చాలా అదృష్టం. చాలా రేర్ గా ఇలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తుంది. 'బాహుబలి' కంటే 'బాహుబలి 2' లో ఎక్కువగా గ్రాఫిక్స్ ఉంటాయి. వార్ సీక్వెన్స్ నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది. ఓ అద్భుతాన్ని చూసిన అనుభూతిని పొందుతారు'' అని చెప్పారు సత్యరాజ్. సో... మరి కొన్ని గంటలు ఆగితే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం తెలిపిసోతుంది.