నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'పైసా వసూలు' ఆడియో వేడుక ఖమ్మంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియోలో భాగంగా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ యుట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ ట్రైలర్ చూస్తూ కుర్రాళ్లు చేసిన హంగామా ఓ వీడియో రూపంలో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అంతగా హంగామా చేసిన కుర్రకారు ఎవరు... ఎక్కడ ఈ హంగామా జరిగింది అనే వివరాల్లోకి వెళితే...
గుంటూరు దగ్గర్లోని కె.యల్ యూనివర్శిటీ హాస్టల్లో 'పైసా వసూలు' ట్రైలర్ విడుదలైన సందర్భంగా, ఈ ట్రైలర్ చూసి కుర్రకారు రెచ్చిపోయారు. జై బాలయ్య, జై బాలయ్య అంటూ హంగామా చేసారు. ఆ హంగామాని వీడియోగా తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియో చూసిన పూరి తన ట్విట్టర్ లో ఈ వీడియోని షేర్ చేసి 'ఐ లవ్ యూ ఆల్.. జై బాలయ్య' అని తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ''నా ఇలాకాలోకొచ్చి ఇగోని టచ్ చేస్తే... నే నిలబడితే, నే కలబడితే, అరే అంతెందుకు నా కటౌట్ కనపడితే, అరే వసూల్ వసూల్ వసూల్ పైసావసూల్'' అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంది. సినిమా విడుదల తర్వాత ఈ డైలాగ్ సార్ధకమవుతుందని 'పైసా వసూలు' చిత్రానికి వస్తోన్న రెస్పాన్స్ చూస్తే అనిపిస్తోంది. నందమూరి అభిమానులే కాదు... సినీ ప్రియుల్లో సైతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సెప్టెంబర్ 1న విడుదలకాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో వేచి చూద్దాం.