'జై లవ కుశ' చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా'స్వింగ్ జరా...' అంటూ ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఐటమ్ పాటకు తమన్నా భారీగా డిమాండ్ చేసి పారితోషికం తీసుకుని ఉంటుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు శీను' చిత్రంలోని ఐటమ్ పాట చేసినందుకు తమన్నా 60 లక్షలు పారితోషికం తీసుకుందనే వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఐటమ్ సాంగ్ చేసింది కాబట్టి, ఈ ఐటమ్ పాటకి కూడా అమ్మడు భారీగానే దండుకుని ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. దీని గురించి తమన్నా దగ్గర అడిగితే...
''కొన్ని రిలేషన్స్ డబ్బు కంటే ఎక్కువ. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం ట్రీట్ లాంటిది. కాబట్టి ఆ పాటకు ఎంత డబ్బు వస్తుందనే విషయం గురించి నేను అసలు పట్టించుకోను. మంచి సినిమాలు చేయడంతో పాటు క్రేజీగా డిజైన్ చేస్తే ఐటమ్ సాంగ్స్ చేస్తాను'' అని చెప్పింది తమన్నా. ఇంత చెప్పిన తమన్నా 'జై లవ కుశ' లోని ఐటమ్ పాట చేయడానికి ఎంత పారితోషికం తీసుకున్నాననే విషయం మాత్రం దాటేసింది. సో... ఎన్టీఆర్ తో ఐటమ్ పాట కాబట్టి, తమన్నా మరో ఆలోచనకు తావివ్వకుండా అంగీకరించి ఉంటుందని ఆమె మాటలను బట్టి చెప్పొచ్చు.