నందమూరి నటసింహం బాలకృష్ణ 102వ సినిమా ‘జై సింహ’ తమిళ్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. నయనతార, నతాషా, హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా ఆడియో రిలీజ్ కి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.
డిసెంబర్ 23న ఈ చిత్రం ఆడియోని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్. విశేషమేంటంటే… బాలయ్య డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల ఆడియో వేడుక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగాయి. ఆడియో వేడుకలో భారీ ఎత్తున నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. బాలయ్య తాజా చిత్రం ‘జయసింహ’ ఆడియో వేడుకను కూడా అమరావతిలోనే జరపాలని ఫిక్స్ అయ్యారట. ఈ ఆడియో వేడుకకు కూడా భారీ ఎత్తున నందమూరి అభిమానులు తరలిరానున్నారని తెలుస్తోంది. సో… డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ణి సీన్ రిపీట్.. జై సింహ కి కూడా అమరావతిలో నందమూరి అభిమానులు జేజేలు పలుకుతారని చెప్పొచ్చు.