ఏ.పి గవర్నమెంట్ 2014, 15, 16 సంవత్సరాలకుగానూ నంది అవార్డులను ప్రకటించినప్పట్నుంచి చిత్ర పరిశ్రమలో నెలకొన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లెజెండ్ కి 9 అవార్డులా… మెగా కుటుంబానికి అన్యాయం జరిగింది... రుద్రమదేవి కి అవార్డు ఇచ్చేంత స్థాయి లేదా… రేసు గుర్రం కి అవార్డు ఎందుకు రాలేదు… అక్కినేని కుటుంబానికి అన్యాయం జరిగింది… సైకిల్ అవార్డులు… నందమూరి అవార్డులు… అంటూ సోషల్ మీడియా సాక్షిగా రచ్చ జరుగుతోంటే, నల్లమలుపు బుజ్జి, గుణశేఖర్, బండ్ల గణేష్ లాంటి వారు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. చానెల్స్ లో దీనికి సంబంధించి బిగ్ డిబేట్స్ జరుగుతున్నాయి. ఎవరి స్పందన వారు తెలియజేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా… మెగాస్టార్ చిరంజీవి గానీ, కింగ్ నాగార్జున గానీ ఈ అవార్డుల గురించి స్పందించలేదు. వీరి స్పందన ఎలా ఉంటుందోనని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ అసలు దీని గురించి మాట్లాడటానికి ఈ స్టార్ హీరోలు సుముఖంగాలేరని చిత్ర పరిశ్రమ టాక్. ఇదిలా ఉంటే…
తాజా వార్తల ప్రకారం బాలయ్య కు చిరు ఫోన్ చేసారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. తనను ప్రతిష్టాత్మక రఘపతి వెంకయ్య అవార్డుకు ఎంపిక చేయడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఫోన్లో బాలయ్యకు చిరు కృతజ్ఞతలు చెప్పినట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి. అవార్డ్ కమిటీకి చైర్మన్ గా బాలయ్య వ్యవహరించారు కాబట్టి, చిరు స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. అయితే నంది అవార్డుల ప్రకటన తర్వాత జరుగుతున్న రచ్చ గురించి మాత్రం ఈ ఇద్దరి మధ్య చర్చకు రాలేదట. సో… బాలయ్యకు చిరు ఫోన్ చేసారనే వార్త నిజమైతే… నంది గురించి బయట జరుగుతున్న రచ్చను ఈ హీరోలు అసలు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పొచ్చు. హుందాగా మాట్లాడుకుని, జరుగుతున్న రచ్చకు తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. ఈ ఇద్దరూ ఇలా మాట్లాడుకున్నారనే వార్త బయటికి పొక్కింది కాబట్టి, ఇక ఈ అవార్డుల గురించి జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు.