యంగ్ టైగర్ ఎన్టీఆర్ కమిట్ మెంట్ గురించి తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో ఇన్సిడెంట్ ఎన్టీఆర్ కమిట్ మెంట్ గురించి తెలియజేసింది. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పింది ఎవరో కాదు... స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్.
'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పరుచూరి గోపాలకృష్ణ చెబుతూ - ''ఎన్టీఆర్ 'ఆది' చిత్రానికి డైలాగ్స్ రాసి పెట్టమని నిర్మాత నాగలక్మీ నా దగ్గరకు వచ్చారు. నాకున్న బిజీ షెడ్యూల్స్ లో ఆ సినిమాకి డైలాగ్స్ రాయలేనని చెప్పాను. కానీ ఆ తర్వాత 'ఆది' సినిమా కోసం డైలాగ్స్ రాయాల్సిన పరిస్థితులు వచ్చాయి. దాంతో మేమే డైలాగులు రాసాము. డైలాగులు చదివి వినిపిస్తుంటే, ఈ డైలాగులు బాలకృష్ణగారి స్ర్కిఫ్ట్ కోసం రాసినట్టు ఉన్నాయి నాన్న అని మా కూతురు నాగసుష్మ చెప్పింది. ఎన్టీఆర్ బ్లడ్... వారి వారసులు ఈ డైలాగులు చాలా ఈజ్ తో చెప్పగలరు అని సుష్మకు చెప్పాను. చెప్పినట్టుగానే 'ఆది' చిత్రంలో ఎన్టీఆర్ డైలాగులు చెప్పిన విధానం నందమూరి అభిమానులను విపరీతంగా అలరించింది.
ఇక ఎన్టీఆర్ కమిట్ మెంట్ గురించి ఓ విషయం చెబుతాను. 'ఆది' చిత్రం షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. గ్లాస్ పగిలి చేతికి గాయమయ్యింది. షూటింగ్ కి బ్రేక్ ఇవ్వక తప్పదనుకున్నాను. కానీ అలా జరగలేదు. షూటింగ్ కి బ్రేక్ ఇవ్వొద్దు అని ఎన్టీఆర్ చెప్పాడట. గాయంతోనే షూటింగ్ చేసేసాడు. నాకు సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారు. 'సర్దార్ పాపారాయుడు' షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గాయాలతో షూటింగ్ చేసారు. ఆయన కమిట్ మెంట్ ఆయన వారసులకు కూడా వచ్చింది అని చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ.