విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. వారాహి అధినేత సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి కూడా ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విద్యాబాలన్, రానా, సుమంత్, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి రానుంది.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతోందట. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ రైట్స్ కోసం క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. ఇక ఓవర్ సీస్ రైట్స్ కోసం అయితే 13కోట్ల ఆఫర్ వచ్చిందట. దీన్నిబట్టి 'ఎన్టీఆర్' క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.