బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ 'ఎన్టీఆర్' బయోపిక్ లో బసవతారకం పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో విద్యాబాలన్ ఇంకా జాయిన్ అవ్వలేదు. అయితే త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతోందట.
కాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేముందు ఎన్టీఆర్ కుటుంబసభ్యులను కలుసుకోవాలని భావించిందట విద్యాబాలన్. ఈ మేరకు నిన్న (16.7.2018) కొంతమంది ఎన్టీఆర్ కుటుంబసభ్యులను కలుసుకుని మాట్లాడిందట. ముఖ్యంగా ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరీతో చాలాసేపు ముచ్చటించిందట. బసవతారకం బాడీ లాంగ్వేజ్, ఆమె డ్రస్సింగ్ స్టైల్, ఆమె అలవాట్లు, హార్మోనియం ప్లే చేయడం... ఇలా ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుందట. సో... బసవతారకం పాత్రలో ఒదిగిపోవడానికి విద్యాబాలన్ కసరత్తులు మొదలుపెట్టిందని చెప్పొచ్చు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ పాత్రలను బాలయ్య పోషిస్తోంటే.. ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, కీర్తిసురేష్, సుమంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, వారాహి అధినేత సాయి కొర్రపాటి, విష్ణు ఇందుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.