తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని తెరకెక్కించడానికి విబ్రి మీడియా డైరెక్టర్, సైమా అవార్డ్స్ చైర్మన్ బృందాప్రసాద్ అడుసుమిల్లి సన్నాహాలు చేస్తున్నారు. 'మదరాసుపట్టణం' చిత్రంతో ఎన్నో అవార్డులు అందుకున్న విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజును పురస్కరించుకుని ఆరోజే చిత్ర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించి అదేరోజున ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే...
జయలలిత పాత్రను పోషించబోయే హీరోయిన్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. త్రిష, నిత్యామీనన్, విద్యాబాలన్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయట. కానీ నయనతార, కీర్తిసురేష్ ల్లో ఎవరో ఒకరితో జయలలిత పాత్ర చేయించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట.
జయలలిత లైఫ్ లో పలు కోణాలు ఉన్నాయి. నటిగా, పార్టీ కార్యకర్తగా, ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్ గా.... జయలలిత జీవితం సాగిన విధానం అందరికీ తెలిసిందే. తమిళనాడు ప్రజలు ఆమెను 'పురట్చచి తలవి', 'అమ్మ', 'ఉక్కుమహిళ'.. అంటూ ఆరాధిస్తుంటారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్న మహిళ జయలలిత. అక్రమాస్థులకు సంబంధించి జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. ఇన్ని కోణాలున్న పాత్రకు కీర్తి సరేష్ లేదా నయనతార అయితే న్యాయం చేయగలుగుతారని భావిస్తున్నారట. మరి ఫైనల్ గా ఈ ఇద్దరిలో ఎవరికి ఈ అవకాశం దక్కుతుందో వేచి చూద్దాం.