ఓ సినిమా షూటింగ్ జరుగుతోందంటే... ఆ సినిమాలోని స్టిల్స్ లీకవ్వడం, వీడియోల రూపంలో క్లిప్పింగ్ బయటికి లీక్ అవ్వడం... రిలీజ్ కి ముందే పైరసీ బారిన పడటం చిత్ర పరిశ్రమకు చెందినవారిని టెన్షన్ కి గురి చేస్తోన్న విషయం. ఇక ఆ సినిమాకి చెందిన దర్శక, నిర్మాతలు, హీరో అయితే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ సినిమాని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా సరే లీకులు ఆగడంలేదు. పైరసీదారులు వెనకడుగువేయడం లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా 80 శాతం విడుదలకు ముందే వీడియో రూపంలో బయటికి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి లీకువీరులను పట్టుకున్నారు. సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎవడు సినిమా కూడా పైరసీ బారిన పడింది. అయితే సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
తాజాగా అరవిందసమేత వీరరాఘవ, గీత గోవిందం సినిమాలను పైరసీ చేయడానికి రంగం సిద్ధం చేసారు. పోలీసులు రంగంలోకి దిగి కొంతమందిని అరెస్ట్ చేసారు. గీత గోవిందం విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇక దసరాకి విడుదలకు సిద్ధమవుతున్న అరవిందసమేత వీరరాఘవ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. సినిమా లీకయ్యిందా.. హిట్టే అని జనాలు జోకులేసుకుంటున్నారు.
సినిమా పైరసీ బారిన పడటం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. కొన్ని వేల కుటుంబాలు ఈ చిత్రపరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్నారు. కాబట్టి లీకులను అరికట్టి, పైరసీ బారిన పడకుండా మొత్తం చిత్ర పరిశ్రమ ఏకమై పోరాడాలి. చిత్ర పరిశ్రమను కాపాడుకోవాలి.