విజయ్ దేవరకొండ సినిమా అంటే వివాదంలో ఇరుక్కోవాల్సిందేనా... ఆ వివాదాలే విజయ్ సినిమాలకు పబ్లిసిటీ అవుతున్నాయా... ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో జరుగుతున్న చర్చ ఇది. నిజమే... విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' చిత్రం చుట్టూ రేగిన వివాదాలు అన్నీఇన్నీ కావు... సినిమా సూపర్ హిట్ అయ్యింది. విజయ్ గత చిత్రం 'గీత గోవిందం' పైరసీ బారిన పడటం, ఈ వివాదం ద్వారా సినిమాకి భారీ పబ్లిసిటీ రావడం తెలిసిన విషయమే. ఈ సినిమా కూడా సూపర్ హిట్. తాజాగా విజయ్ దేవరకొండ 'నోటా' చిత్రం కూడా వివాదంలో ఇరుక్కుంది. ఆ వివరాల్లోకి వెళితే...
విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రం 'నోటా'. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి రైటర్ వెన్నెలకంటి తనయుడు శశాంక్ వెన్నెలకంటి డైలాగులు రాసారట. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ లో డైలాగ్ రైటర్ గా శశాంక్ వెన్నెలకంటి పేరు పడలేదట. కథ, స్ర్కీన్ ప్లే తో పాటు డైలాగ్ రైటర్ గా కూడా డైరెక్టర్ ఆనంద్ శంకర్ పేరు ఉందట. ట్రైలర్ లో వచ్చిన డైలాగులు శశంక్ వెన్నెలకంటి రాసినవేనట. దాంతో తనకు అన్యాయం జరిగిందని... డైలాగ్స్ రాసినందుకు డబ్బులు ఇవ్వలేదు సరికదా, కనీసం పేరు కూడా వేయకపోవడం కరెక్ట్ కాదని శశాంక్ వెన్నెలకంటి ఆరోపిస్తున్నారు.
ఇదే విషయంపై శశాంక్ మీడియాతో మాట్లాడారు. డైలాగ్స్ రాసినందుకు పారితోషికం, టైటిల్ కార్డ్ క్రెడిట్ రెండు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసాడు. తనకు సెటిల్ చేసిన తర్వాతే సినిమా విడుదలయ్యేలా చేయాలని కూడా శశాంక్ కోరారు. మరి ఈ వివాదంపై చిత్ర దర్శక, నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మరక మంచిదే అన్నట్టు, ప్రస్తుతం రేగిన వివాదం కూడా విజయ్ దేవరకొండ 'నోటా' చిత్రానికి విపరీతమైన పబ్లిసిటీ తీసుకువచ్చి ప్లస్ అవుతుందేమో...!