నందమూరి కుటుంబానికి చెందిన హీరోలను... ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఒకే వేదిక మీద చూడాలని కోరుకుంటారు నందమూరి అభిమానులు. గతంంలో పలు సందర్భాల్లో ఈ బాబాయ్, అబ్బాయిని ఒకే వేదిక మీద చూశారు. అయితే చాలా కాలం నుంచి జాయింట్ దర్శనాలు కరువయ్యాయి. దానికి కారణాలు ఏవైనప్పటికీ... నందమూరి హరికృష్ణ మరణం బాబాయ్, అబ్బాయ్ లను ఒకటి చేసింది. హరికృష్ణ అంతిమయాత్రలోనూ, ఆ తర్వాతి కార్యక్రమాల్లోనూ బాబాయ్, అబ్బాయ్ లు ఒకటిగా నిలబడటం అంత శోకంలోనూ అందరినీ సంతోషపడేలా చేసింది. అయితే ఇక్కడితోనే వీరు కలుసుకోవడానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేక ఇకపై తరుచూ కలుస్తూ ఉంటారా అనే సందేహం అందరిలో ఉంది. నందమూరి అభిమానులు అయితే నందమూరి కుటుంబం మొత్తం ఒకే తాటిపై నడవాలని కోరుకుంటుంటారు. ఇప్పుడు అందుకు మూహూర్తం కుదరడం నందమూరి అభిమానులను ఎగ్జయిటింగ్ కి గురి చేస్తోంది. ఇంతకీ ఆ ముహూర్తం ఏంటీ అనే వివరాల్లోకి వెళితే...
రేపు (21.10.2018) యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ సక్సెస్ మీట్ కి నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా అటెండ్ అవుతున్నారు. 'అరవింద సమేత' చిత్రం యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించేసింది. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా అటెండ్ అవుతున్నాడు. అంతే... ఈ విషయం బయటికి వచ్చినప్పట్నుంచి నందమూరి అబిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక రేపు ఒకే వేదికపైన అబ్బాయ్ లను, బాబాయ్ ను చూస్తూ ఎంత ఎగ్జయిటింగ్ కి గురవుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి బాబాయ్, అబ్బాయ్ ల స్పీచ్ ఎలా ఉండబోతుందో చూద్దాం.