గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ ని ఓ రేంజ్ లో ఏలేసింది. టాలీవుడ్ లో కెరియర్ సజావుగా సాగుతున్నప్పుడే బాలీవుడ్ కి జంప్ అయిపోయింది. అక్కడ వరుసగా సినిమాలు పట్టేసింది. దాంతో టాలీవుడ్ కి దూరమయ్యింది. ఇలియానా ఫ్యాన్స్ అప్ సెట్ అయిపోయారు. అలా టాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన ఇలియానా 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు వస్తే, వాటిని అందిపుచ్చుకుని తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తుందా లేక మళ్లీ టాలీవుడ్ ని వదిలేస్తుందా వేచి చూడాలి. ఇదిలా ఉంటే... అసలు తను టాలీవుడ్ కి దూరమవ్వడానికి కారణం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ విషయంలోకి వెళితే...
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'జులాయి' సినిమా చేస్తున్నప్పుడు ఇలియానాకి బాలీవుడ్ నుంచి 'బర్ఫీ' సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాని అంగీకరించాలా లేదా అనే డైలమాలో ఉన్నప్పుడు... ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ఇలియానాకి చెప్పారట డైరెక్టర్ త్రివిక్రమ్. దాంతో 'బర్ఫీ' సినిమాని అంగీకరించింది. అలా బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానాకి వరుసగా ఆఫర్లు రావడం, అక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. అందుకే త్రివిక్రమ్ వల్లే తను టాలీవుడ్ కి దూరమయ్యానని ఇలియానా అంటోంది. మరి 'అమర్ అక్బర్ ఆంటోని' తో రీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి, ఈ ఎంట్రీ అమ్మడి కెరియర్ ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచిచూద్దాం.