'అరవింద సమేత వీరరాఘవ' వంటి హిట్ చిత్రం చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి సినిమాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు స్వయంగా చిరు ప్రకటించారు. తాజాగా మరో హీరో కూడా త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని, మా కాంబినేషన్ ఆగిపోలేదని చెప్పాడు. ఎవరా హీరో అనే వివరాల్లోకి వెళితే...
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హీరోగా రూపొందిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరీ' చిత్రాలు. ఈ రెండు సినిమాలకు కథ, డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించాడు. విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాలు రూపొందాయి. హ్యుమరస్ టచ్ తో కూడుకున్న హీరో క్యారెక్టరైజేషన్, ఈ రెండు చిత్రాల కథలు, డైలాగ్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలు కనెక్ట్ అయ్యాయి. వెంకీ కెరియర్ లో ఈ సినిమాలకు ప్రత్యేకమైన స్థానం లభించింది. వెంకీ హీరోగా రూపొందిన 'వాసు' చిత్రానికి కూడా త్రివిక్రమ్ డైలాగులు అందించాడు. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఎప్పట్నుంచో వినబడుతున్నాయి. కానీ త్రివిక్రమ్ వరుస కమిట్ మెంట్స్ తో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. ఈ సినిమా ఆగిపోలేదని, కథ కుదరక ఆరంభమవ్వలేదని చెప్పాడు హీరో వెంకటేష్. కథ సెట్ అవ్వగానే తమ కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని వెంకీ చెప్పాడు కాబట్టి, త్రివిక్రమ్, వెంకీ సినిమా ఆగిపోలేదని ఫిక్స్ అయిపోవచ్చు.