'ఆగడు', 'బ్రూస్ లీ', 'మిస్టర్', 'అఅఆ'... ఈ నాలుగు సినిమాలు డైరెక్టర్ శ్రీను వైట్ల కెరీర్ ని డైలమాలో పడేసాయి. వరుస ఫ్లాపులతో ఇక శ్రీను వైట్ల కెరియర్ ముగిసిపోయినట్టేనని జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీను వైట్ల ఈ నాలుగు ఫ్లాపులతో అధైర్యపడలేదు. తాజా వార్తల ప్రకారం ఓ స్టార్ హీరో కోసం గేలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం గత కొంతకాలంగా మనస్ఫర్ధలతో విడిపోయిన ముగ్గురు ఒకటయ్యారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీ మోహన్... ఈ ముగ్గురూ కలిసి టీమ్ గా వర్క్ చేసినప్పుడు సక్సెస్ లు చవిచూసారు. 'దూకుడు' వరకూ కలిసి వర్క్ చేసిన ఈ ముగ్గురూ ఇగో క్లాష్ లతో విడిపోయారు. సక్సెస్ క్రెడిట్ ని షేర్ చేసుకునే విషయంలో కోన వెంకట్, శ్రీను వైట్ల మధ్య రేగిన వివాదం ఈ ముగ్గురినీ దూరమయ్యేలా చేసింది. ఈ ఇద్దరినీ వీడిన తర్వాత శ్రీను వైట్ల చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. ఈ నేపధ్యంలో శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీ మోహన్ మళ్లీ కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయబోతున్నారు. గోపీ మోహన్ కథ, కోన వెంకట్ డైలాగ్స్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమవుతోందట. ఓ స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సో... సక్సెస్ ఫుల్ టీమ్ కలుస్తోంది కాబట్టి, ఈసారి శ్రీను వైట్ల పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళతాడని ఊహించవచ్చు.