మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'చిత్రలహరి' చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 12న థియేటర్స్ కి రానుంది. దీని తర్వాత సాయిధరమ్ తేజ్ తదుపరి సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
రెండేళ్ల క్రితం రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో అమ్మడికి కోలీవుడ్, బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని తెలుగు సినిమాలను తగ్గించింది. అలా టాలీవుడ్ లో రకుల్ దూకుడికి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ పై దృష్టి సారించాలనుకుంటోందట రకుల్. అందుకే తనకు వస్తున్న టాలీవుడ్ ఆఫర్స్ ని రకుల్ వదులుకోవడంలేదు. సాయిధరమ్ తేజ్, మారుతి సినిమా కోసం రకుల్ ని కాంటాక్ట్ చేయగానే, అమ్మడు మరో మాట మాట్లాడకుండా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సాయిధరమ్ తేజ్, రకుల్ కలిసి 'విన్నర్' సినిమాలో నటించారు. మళ్లీ ఈ కాంబినేషన్ మారుతి సినిమాలో రిపీట్ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారమ్.