రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు ఓ పెద్ద హిట్ కావాలి. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోంది కానీ, వరుస ఫ్లాప్ లను చవిచూస్తోంది. దాంతో అమ్మడు కాస్త నిరాశ పడుతున్నప్పటికీ, కమిట్ అవుతున్న సినిమాలకు డిమాండ్ చేసి పారితోషికం తీసుకోవడంలో మాత్రం రకుల్ అసలు వెనకడుగు వేయడంలేదట. తాజా వార్తల ప్రకారం తను కమిట్ అయిన రెండు సినిమాలకు డిమాండ్ చేసి మరీ పారితోసికం తీసుకుందట. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న 'మన్మధుడు2' చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నటించడానికిగానూ 2కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట రకుల్. ఆమె డిమాండ్ ని అంగీకరించి 2కోట్లు పారితోషికం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో ఈ సినిమాకి సైన్ చేసిందట రకుల్.
ఇక కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తమిళ్ సినిమా 'రాట్ససన్' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసారట. ఈ సినిమాలో నటిస్తున్నందుకుగానూ 2 కోట్లు డిమాండ్ చేసిందట రకుల్. సింగిల్ సిట్టింగ్ లోనే స్టోరీ లైన్ విని, 2కోట్లు పారితోషికం కావాలని అడగడంతో నిర్మాతలు అంగీకరించారట. ఈ డీల్ సెట్ అవ్వడంతో వెంటనే అగ్రిమెంట్ పై సైన్ చేసిందట రకుల్. సో... హిట్స్ లేకపోయినా, అమ్మడు పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గడంలేదని దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. సీనియర్ హీరోని, కుర్ర హీరోని రకుల్ బాగా వర్కవుట్ చేసుకుందని చెప్పొచ్చు.