వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి 'చిత్రలహరి' చిత్రంతో కొంత ఊరట లభించింది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ మెగా మేనల్లుడుని మేనమామ, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. 'చిత్రలహరి' చిత్రం యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.
సినిమా సక్సెస్ పట్ల చిరు స్పందిస్తూ - ''కిషోర్ తిరుమల 'చిత్రలహరి' చిత్రాన్ని సెటిల్డ్ మెసేజ్తో చాలా చక్కగా తెరకెక్కించాడు. దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇక తేజు కూడా నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్తో చాలా చక్కగా నటించాడు. పరిణితిని సాధించిన నటుడిగా నిరూపించుకున్నాడు. పోసాని కృష్ణమురళి, సునీల్ సహా ఇతర నటీనటులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించి నిండుదనం తెచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. సక్సెస్ఫుల్ సినిమాలకు మైత్రీ మూవీస్ సంస్థ అడ్రస్గా నిలుస్తుంది. వారి ప్రతిష్టను మరింత నిలబెట్టుకునే విధంగా ఈ సినిమాను రూపొందించారు. బంధాలు, అనుబంధాలు గురించి ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య అనుబంధం గురించి చక్కగా చెప్పారు. ఎలాంటి ఒడుదొడుకులు వచ్చినా మనం అనుకున్న లక్ష్యం సాధించడానికి కృషితో ముందుకు వెళ్లాలని చెప్పిన చిత్రం 'చిత్రలహరి'. ఈ వేసవికి విడుదలైన 'చిత్రలహరి' ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం. సినిమా సక్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్కు నా శుభాకాంక్షలు'' అన్నారు.
మొత్తం మీద మెగా మేనల్లుడుకి మెగాస్టార్ ఆశీస్సులు దక్కాయని చెప్పొచ్చు.