30 ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది నటుడు పృథ్వీ. ఈ మధ్య రాజకీయాల పరంగా కూడా వార్తల్లో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసాడు పృథ్వీ. ఆ సమయంలో మెగా కుటుంబానికి చెందిన హీరోలపైన, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన చాలా విమర్శలు చేసాడు. ఈ నేపధ్యంలో పృథ్వీపై మెగా కుటుంబం గుర్రుగా ఉందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందోకానీ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలో పృథ్వీ ఉండకూడదని చాలా గట్టిగా చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో పృథ్వీ కోసం చాలా మంచి పాత్ర క్రియేట్ చేసారట. అయితే పృథ్వీని తీసుకోవద్దని, ఈ పాత్రని వేరే వారితో చేయించాలని అల్లు అర్జున్ చాలా గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇకపై మెగా హీరోల సినిమాల్లో పృథ్వీ కనిపించడం కష్టమేనని ఫిక్స్ అయిపోవచ్చు. సినిమా, రాజకీయం వేరైనప్పటికీ... పృథ్వీ పర్సనల్ గా వ్యక్తులపై బురద జల్లడం మెగా హీరోలను చాలా గాయపరిచిందట. అందుకే మెగా హీరోలు పృథ్వీకి ఈ రకంగా జలక్ ఇస్తున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు.