స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'సరైనోడు' సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్లాక్ బస్టర్ సినిమా ఇది. కాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఆ వివరాల్లోకి వెళితే...
'వినయ విధేయ రామ' చిత్రం తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను తదుపరి సినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. నటసింహం నందమూరి బాలకృష్ణతో బోయపాటి సినిమా ప్రకటన వచ్చింది. కానీ ఈ సినిమాకి బోయపాటి 60 నుంచి 70 లక్షలు బడ్జెట్ ఇవ్వడంతో, ప్రస్తుతానికి ఈ సినిమా హోల్డ్ లో పెట్టారని సమాచారమ్. తాజాగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తమ బ్యానర్ లో బోయపాటి దర్శకత్వంలో సినిమా ఉంటుందని 'గుణ 369' సినిమా ట్రైలర్ లాంఛ్ లో ప్రకటించారు. దాంతో గీతాలో బోయపాటి చేయబోతున్న సినిమాకి హీరో ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.
చాలామంది బోయపాటి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాకి సంబంధించి ఎప్పుడో చర్చలు జరిగాయి. అయితే కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి గీతా అధినేత అల్లు అరవింద్ ప్రయత్నాలు మొదలుపెట్టారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే గీతా ఆర్ట్స్ సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న వార్తల ప్రకారం బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడట. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ కోసం మంచి కథ రెడీ చేయమని బోయపాటికి అల్లు అరవింద్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇందుకు బోయపాటి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సో.... కథ కుదిరితే 'సరైనోడు' కాంబినేషన్ రిపీట్ కానుందని ఫిక్స్ అయిపోవచ్చు.