సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తదుపరి షెడ్యూల్ ని ఈ నెల 26 నుంచి హైదరాబాద్ లో ఆరంభించడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా వినిపిస్తున్న వార్తలు జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...
కర్నూల్ లో ఫేమస్ ల్యాండ్ మార్క్ అయిన కొండారెడ్డి బురుజుకు సంబంధించిన సెట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో వేసారు. ఈ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఈ సెట్ వేయడానికి దాదాపు 4 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా రూపొందిన 'ఒక్కడు' చిత్రంలో కొండారెడ్డి బురుజు దగ్గర చిత్రీకరించిన ఎపిసోడ్ ఆడియన్స్ ను ఉత్కంఠతకు గురి చేసింది. సినిమాకి ఆ ఎపిసోడ్ హైలైట్ కూడా అయ్యింది. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని కొన్ని సన్నివేశాలను కూడా కొండారెడ్డి బురుజు సెట్ లో చిత్రీకరించబోతున్నారు. మరి ఈ సీన్స్ సినిమాకి ఎంత హైలైట్ గా నిలుస్తాయో వేచిచూద్దాం.