స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'అల వైకుంఠపురములో...'
ఈ రోజు (1.9.2019) ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ తన అధికారిక సామాజిక మాధ్యమం అయినా ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదలచేశారు. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూడో చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాల్లో, అటు ప్రేక్షక వర్గాల్లోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
'అల... వైకుంఠపురములో' ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇటీవలే చిత్రం టైటిల్ ను వీడియో ద్వారా ప్రకటించటం జరిగింది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోజు విడుదల అయిన తొలి ప్రచార చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపిస్తున్న తీరు ప్రేక్షకాభిమానులను కనువిందు చేయటంతో పాటు, చిత్రం పై అంచనాలు మరింత పెరిగేలా చేసింది. మాస్, క్లాసీగా అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం హైదారాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల కానుంది.