కరోనా వైరస్ విజృంభణతో చిత్ర పరిశ్రమ లాక్ డౌన్ మోడ్ లో ఉంది. దాంతో తాము ఆల్ రెడీ చేస్తున్న సినిమాలను పక్కన పెట్టి, తదుపరి సినిమాలపై దృష్టి సారించారు స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివ, పూరి జగన్నాధ్. లాక్ డౌన్ ని బాగా ఉపయోగించుకుంటున్న ఈ డైరెక్టర్లు ఇప్పటికే తదుపరి సినిమాల కోసం కథలు రెడీ చేసారట. ఆ వివరాల్లోకి వెళితే...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో 'ఆర్ఆర్ఆర్' సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.
మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు కొరటాల శివ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమా చేస్తున్నారు పూరి జగన్నాధ్. అయితే లాక్ డౌన్ వల్ల ఈ సినిమాల షూటింగ్ లకు బ్రేకులు పడ్డాయి.
కాగా తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా కోసం కథ ఫైనలైజ్ చేసారట రాజమౌళి. ఓ మంచి స్టోరీ లైన్ కుదిరినట్టు తెలుస్తోంది.
కొరటాల శివ కూడా ఓ కథ రెడీ చేసారట. ఈ కథ ఏ హీరో కోసమనే విషయంలో క్లారటీ లేదు కానీ, అల్లు అర్జున్ కోసం అల్లు అరవింద్ మంతనాలు జరుపుతున్నట్టు వినికిడి. అన్ని కుదిరితే 'ఆచార్య' తర్వాత అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా చేసే అవకాశముందని తెలుస్తోంది.
అలాగే బాలయ్య కోసం పూరి జగన్నాధ్ ఓ కథ రెడీ చేసారట. ఫోన్ లో బాలయ్యకు స్టోరీ లైన్ వినిపించారట. కథ నచ్చడంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత పూరి దర్శకత్వంలోని సినిమాతో బాలయ్య ముందుకెళ్లే అవకాశముందని సమాచారమ్. దీని వల్ల బి.గోపాల్ సినిమా వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. ఎందుకంటే బి.గోపాల్, బాలయ్య కాంబినేషన్ సినిమా కోసం కథ రెడీ అవ్వలేదట.
సో... లాక్ డౌన్ ని ఈ డైరెక్టర్లు ఫుల్లుగా వాడుకున్నారని చెప్పొచ్చు.