శర్వానంద్ 'రన్ రాజా రన్' సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయిన సుజిత్ ఆ తర్వాత ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా 'సాహో' చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం సుజిత్ కి దక్కిందనే వార్తలు బయటికి వచ్చాయి. రెండు సినిమాల అనుభవమున్న సుజిత్ కి భారీ బడ్జెట్ సినిమాలకు డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఏంటీ, టాప్ హీరోలతో సినిమాలు చేయడమేంటని అందరూ షాక్ అయ్యారు. కాగా తాజా వార్తల ప్రకారం చిరు సినిమా నుంచి సుజిత్ అవుట్ అయినట్టు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా యు.వి.క్రియేషన్స్ నిర్మించనున్న సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక చిరు సినిమాకి వేరే డైరెక్టర్ లైన్లోకి వచ్చినట్టు వార్తలు అందుతున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరు... చిరు చేయబోతున్న సినిమా ఏంటీ అనే వివరాల్లోకి వెళితే...
మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న'లూసిఫర్' తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కి సుజిత్ దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు సుజిత్ కి ఈ అవకాశం చేజారింది. ఈ రీమేక్ కి డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. చిరు హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఠాగూర్', 'ఖైదీ నెం.150' చిత్రాలు తెరకెక్కాయి. ఈ రెండూ హిట్ సినిమాలే. ఈ నేపధ్యంలో 'లూసిఫర్' రీమేక్ కి దర్శకత్వం వహించే అవకాశం వినాయక్ కి ఇవ్వాలని భావిస్తున్నారట చిరంజీవి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.