యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు రూటు మార్చారు. తెలివిగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. తమ కంటూ సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఆడియో వేడుకల్లో, సక్సెస్ మీట్ ల్లో మాత్రమే కనిపించి ఫ్యాన్స్ ని పలుకరించే ఆనవాయితీకి స్వస్తి చెప్పేసారు ఈ హీరోలు. షూటింగ్ లొకేషన్స్ లో, మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని కలుస్తున్నారు. ఎందుకీ మార్పు.. దేని కోసం ఈ హీరోల టార్గెట్ అనే చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది. వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్
'జనతాగ్యారేజ్' చిత్రం షూటింగ్ ఆరంభమైనప్పట్నుంచి లొకేషన్స్ కి వస్తున్న అభిమానులను కలుస్తున్నాడు ఎన్టీఆర్. ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. ఇప్పటివరకూ పది వేల ఫోటోగ్రాఫ్స్ కి ఫోజులిచ్చాడంటేనే ఎన్టీఆర్ ఏ రేంజ్ లో అబిమానులకు సమయం కేటాయిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్ మధ్య మనస్ఫర్ధలు ఏర్పడటం, ఇద్దరూ దూరంగా ఉండటం తెలిసిన విషయమే. దాంతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ సినిమాలకు దెబ్బేస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రాలకు ఫస్ట్ డే రావాల్సినంత ఓపినింగ్స్ రాలేదు. నిజం చెప్పాలంటే ఈ రెండు సినిమాలు హిట్. కానీ 50కోట్ల క్లబ్ లో చేరడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. అతి కఫ్టం మీద 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో ఎన్టీఆర్ 50కోట్ల క్లబ్ లో చేరాడు. ఇది ఎన్టీఆర్ స్టామినాకి చాలా తక్కువ. 70, 80 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోవాల్సిన స్టామినా ఉన్న హీరో ఎన్టీఆర్. బ్లాక్ బస్టర్ సినిమా అయితే 100కోట్ల క్లబ్ లో చేరిపోవాల్సిన హీరో. కానీ ఇది జరగడంలేదు. అందుకే ఎన్టీఆర్ రూటు మార్చాడు. అభిమానులకు దగ్గరవ్వడానికి తాపత్రయపడుతున్నాడు. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను పెంచుకుంటున్నాడు. ఈ ఎఫెక్ట్ 'జనతాగ్యారేజ్' చిత్రంపై పడుతుంది. ఓపినింగ్స్ భారీగా ఉంటాయి. తద్వారా ఎన్టీఆర్ సినిమాల బిజినెస్ పెరుగుతుంది. వసూళ్లు అదే రేంజ్ లో పెరుగుతాయి. అందుకే ఎన్టీఆర్ చాలా తెలివిగా తనకంటూ సొంతంగా అభిమాన వర్గాన్ని ఏర్పర్చుకోవడం కోసం అడుగులు వేస్తున్నాడని అర్ధం చేసుకోవచ్చు.
రాంచరణ్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఫ్యాన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. అప్పట్లో అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎడమహం పెడమొహంగా ఉండటంతో అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మెగాభిమానులు కాస్త.. చిరు అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అనేంతగా సీన్ మారింది. దాంతో మొత్తం అభిమానులను ఒక తాటిపైకి తీసుకురావడానికి మెగా హీరోలు కృషి చేసారు. అన్నయ్య, తమ్ముడు, అబ్బాయ్ రాంచరణ్ అందరూ కలుసుకున్నారు. షూటింగ్ లొకేషన్స్ కి వెళ్లడం, ఒకరు ఆడియో ఫంక్షన్స్ కి మరొకరు అటెండ్ అవ్వడం చేస్తున్నారు. ఆ రకంగా మళ్లీ మెగాభిమానులను ఒక తాటిపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. కొంతమంది ముఖ్యమైన మెగాభిమానులను సెలెక్ట్ చేసి షూటింగ్ లొకేషన్ కి తీసుకెళ్లి చిరుని కలిసేలా చేయాలనే ప్లాన్ లో రాంచరణ్ ఉన్నాడు. దీనివల్ల మెగాభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచినట్టు అవుతుంది. పైగా మెగాబిమానులందరూ ఒకే తాటిపైన ఉంటారు. ఇది మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరోల సినిమాలకు బాగా కలిసొస్తుంది. అందుకే రాంచరణ్ ఫ్యాన్స్ ని వీలు కుదిరినప్పుడల్లా కలుస్తున్నాడు.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ కి సెపరేట్ ఫ్యాన్ గ్రూప్ తయారయ్యిందని గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య 'కుమారి 21ఎఫ్' చిత్రం ఆడియో వేడుకలో అల్లు అర్జున్ పాల్గొన్నప్పుడు ఈ విషయం తేట తెల్లమయ్యింది. అఖిల భారత అల్లు సంఘం అనే గ్రూప్ ని ఏర్పాటు చేసాడు అల్లు అర్జున్. తనకంటూ సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవాలనే తాపత్రయంతోనే అల్లు అర్జున్ ఈ గ్రూప్ ని ఏర్పాటు చేసాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ కి విబేధాలు నెలకొన్నాయి. వాటిని కొంతమేర క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, సొంతంగా అభిమాన వర్గాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇందుకోసం అభిమానులను కలుస్తున్నాడు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నాడు. ఇలా కంటిన్యూగా అభిమానుల టచ్ లో ఉండటం అల్లు అర్జున్ కి కలిసొస్తుందని, భవిష్యత్తులో అల్లు అర్జున్ కి సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.
మొత్తం మీద కుర్ర హీరోలందరూ తమకంటూ సొంతంగా అభిమానవర్గాన్ని ఏర్పర్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. మరి దీనివల్ల ఏ మేరకు వీరు ఆశించిన ఫలితాన్ని పొందుగలుగుతారో వేచి చూడాల్సిందే.