సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుకెళుతున్న సంపత్ రాజ్ కుమార్ విషయంలో ఇదే జరుగుతోందని పరిశీలకులు అంటున్నారు. పంజా, దమ్ము చిత్రాల తర్వాత సంపత్ చేసిన చిత్రాల్లో 'మిర్చి' అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ శత్రువు కుటుంబానికి చెందిన సంపత్ నటన పరంగా విజృంభించాడు. దాంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోయాడు. పవర్, లౌక్యం, సన్నాఫ్ సత్యమూర్తి తదితర చిత్రాల్లో నటించాడు. కానీ, ఇప్పుడు మాత్రం తెలుగు దర్శక, నిర్మాతలు సంపత్ ను ఎంకరేజ్ చేయకూడదని అనుకుంటున్నారట. దానికి కారణం ఇతగాడి తీరు అని సమాచారం. కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే...
'మిర్చి' చిత్రానికి సంపత్ మొత్తం 25 రోజులు పని చేశాడని సమాచారం. రోజుకి లక్ష రూపాయలు చొప్పున 25 లక్షల రూపాయలు తీసుకున్నాడట. ఆ తర్వాత ఇదే సంస్థ 'రన్ రాజా రన్' చిత్రం చేస్తూ, సంపత్ ను అడిగితే, రోజుకి లక్ష కావాల్సిందే అన్నాడట. 'మిర్చి' అంత పెద్ద సినిమా కాదని, కొంచెం తగ్గించుకోవాలని కోరితే సరేనని, ఈ చిత్రం కోసం సంపత్ 15 రోజులు పని చేశాడట. అందుకుగాను ఏడున్నర లక్షలు తీసుకోవడానికి ముందు అంగీకరించిన సంపత్ ఆ తర్వాత, 15 లక్షల ఇస్తేనే అని మొండిపట్టు పట్టాడని భోగట్టా. ఏడున్నర లక్షలిస్తే, తీసుకోవడానికి నిరాకరించాడని వినికిడి. సినిమా హిట్టయ్యింది కదా.. అని వాదించాడట. చేసేదేం లేక 15 లక్షలు సమర్పించుకున్నారట. అలాగే, 'మిర్చి'తో సంపత్ కి మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు కొరటాల త్వరలో విడుదల కానున్న తన 'శ్రీమంతుడు'కి సంపత్ ని అడిగాడట. బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ అనే సెంటిమెంట్ కూడా లేకుండా ఏకంగా 50 లక్షలు అడిగాడట.
ఒక్క 'శ్రీమంతుడు' అనే కాదు.. శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రానికి కూడా సంపత్ భారీగా డిమాండ్ చేసాడట. దాంతో ఈ చిత్రంలోని పాత్రకు హరీష్ ఉత్తమన్ ని తీసుకున్నారట. ఎక్కువ డిమాండ్ చేసిన కారణంగానే 'జిల్' చిత్రం కూడా సంపత్ చేజారిందని సమాచారం. ఆ పాత్రను కబరీ్ ఖాన్ తో చేయించారట. కబీర్ ఖాన్ కి ఆ సినిమా చాలా ప్లస్ అయ్యింది. సంపత్ బిల్డప్ కారణంగా ప్రదీప్ రావత్, కబీర్ ఖాన్, హరీష్ ఉత్తమన్ లాభపడుతున్నారని, అతన్ని అనుకున్న పాత్రలకు దర్శక, నిర్మాతలు వీళ్లని తీసుకుంటున్నారని టాక్. సంపత్ ఇకనైనా బిల్డప్ తగ్గించుకోవాలని లేకపోతే టాలీవుడ్ లో మనుగడ కష్టమేనని పరిశీలకులు అంటున్నారు.