బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలైన 'మాట్రాన్', 'కోచడయాన్', 'లింగ', 'కత్తి' చిత్రాలకు భాగస్వాములుగా వ్యవహరించడంతో పాటు పంపిణీ కూడా చేసారు. తెలుగులో నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం డిక్టేటర్' చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది ఈరోస్. మహేష్ బాబు హీరోగా రూపొందిన '1', 'ఆగడు', 'శ్రీమంతుడు' చిత్రాలను పంపిణీ చేసిన ఈ సంస్ధ తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'సర్దార్' చిత్రంపై కన్నేసిందని తెలుస్తోంది.
'సర్దార్' చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ ఆగస్ట్ 10నుంచి ఆరంభంకానుంది. ఆ తర్వాత ఈ చిత్రం యూనిట్ గుజరాత్ బయలుదేరి వెళ్లనుందని, అక్కడ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసారని సమాచారమ్. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని 70కోట్లు ఆఫర్ చేసి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కైవసం చేసుకుందట. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోంది ఈరోస్. టాలీవుడ్ లో ప్రస్తుతం రూపొందుతోన్న ప్రాజెక్ట్ ల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ 'సర్దార్'. 'అత్తారింటికి దారేది'లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ఇది. పైగా హిట్ చిత్రం 'గబ్బర్ సింగ్'కి సీక్వెల్. ఈ చిత్రం విడుదల కోసం పవన్ అభిమానులు ఎదురుచూపులు చూస్తున్నారు. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 70కోట్లు ఇచ్చి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకుందని సమాచారమ్. వచ్చే యేడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.