మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన 'అతడు' చిత్రం మహేష్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ ని తెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేసాడనే ప్రశంసలు త్రివిక్రమ్ కి దక్కాయి. తొలి సినిమాతోనే త్రివిక్రమ్, మహేష్ కు మధ్య మంచి అనుబంధం నెలకొంది. దాంతో ఎక్కువ గ్యాప్ లేకుండానే ఈ కాంబినేషన్ లో 'ఖలేజా' టైటిల్ తో ఓ చిత్రం రూపొందింది. ఈ రెండో చిత్రం ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుని వీరి కాంబినేషన్ సినిమాకి కొంత గ్యాప్ వచ్చేలా చేసింది.
మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఓ కథ తయారు చేయమని కూడా చెప్పాడట. ప్రస్తుతం తను చేసిన 'శ్రీమంతుడు' తర్వాత చేయబోతున్న 'బ్రహ్మోత్సవం' రెండూ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కాబట్టి, మంచి కమర్షియల్ పాయింట్ తో యాక్షన్ తో కూడుకున్న కథను తయారు చేయమని త్రివిక్రమ్ దగ్గర చెప్పాడట మహేష్ బాబు. అయితే త్రివిక్రమ్ దగ్గర అలాంటి కథ లేదట. దాంతో కొంచెం టైమ్ పడుతుందని చెప్పాడట త్రివిక్రమ్. టైమ్ తీసుకుని అయినా సరే, మంచి కథ తయారు చేయమని త్రివిక్రమ్ ని మహేష్ కోరినట్టు సమాచారమ్. మహేష్ 'బ్రహ్మోత్సవం' పూర్తి చేసే లోపల తను అడిగినట్టు ఓ యాక్షన్ కథను తయారు చేసి చెప్పాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. సో... మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే తదుపరి చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండే అవకాశముందని ఊహించవచ్చు.