యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి హిట్ చిత్రాలు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందాయి. ఈసారి 1000కోట్ల బడ్జెట్ తో ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే చిత్రాన్ని చేయడానికి రాజమౌళి, ఎన్టీఆర్ సమాయత్తమవుతున్నారనే వార్తలు ఉన్నాయి. ఈ సినిమాకి 'గరుడ' టైటిల్ అనుకుంటున్నారని, వచ్చే యేడాది ఎన్టీఆర్ పుట్టినరోజునాడు ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరపడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు ప్రచారం అయ్యాయి. దాంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్, రాజమౌళి చేయడంలేదనే వార్త బయటికి పొక్కడంతో అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
వెయ్యి కోట్ల బడ్జెట్ తో 'గరుడ' చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరోతో చేయాలనుకుంటున్నారట రాజమౌళి. అందుకని ఎన్టీఆర్ ని రాజమౌళి పక్కన పెట్టేసారనుకుంటే పొరపాటే. ఎందుకంటే రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో చిత్రం రూపొందనుంది. అది కూడా 'బాహుబలి 2' రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ తోనే సినిమా చేయబోతున్నారట రాజమౌళి. అయితే అది 'గరుడ' కాదు. ఎన్టీఆర్ కోసం వేరే కథను తయారు చేసారట రాజమౌళి. ఇది కూడా అద్భుతమైన కథ అని, ఎన్టీఆర్ కి ఆల్ రెడీ ఈ స్టోరీ లైన్ చెప్పేసారని సమాచారమ్. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుందట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.