యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్టూడెంట్ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి హిట్ చిత్రాలు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందాయి. మళ్లీ వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి 2' చిత్రం విడుదలైన వెంటనే రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది. అయితే అందరూ అనుకుంటున్నట్టు అది 'గరుడ' చిత్రం కాదు. వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో 'గరుడ' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందట. అయితే 'గరుడ' పట్టాలెక్కేలోపు ఎన్టీఆర్ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట రాజమౌళి.
కాగా ఎన్టీఆర్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్న చిత్రం భారీ మల్టీస్టారర్ సినిమా అని సమాచారమ్. ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ తో పాటు తమిళ్ స్టార్ హీరో సూర్యను నటింపజేయబోతున్నారట రాజమౌళి. ఆల్ రెడీ ఎన్టీఆర్, సూర్యతో ఈ సినిమా గురించి చర్చిస్తున్నారట రాజమౌళి. ఇది చాలా అద్భుతమైన కథ అని, ఎన్టీఆర్ కి ఆల్ రెడీ ఈ స్టోరీ లైన్ చెప్పేసారని సమాచారమ్. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుందట. ఓ టైటిల్ ని కూడా ఈ మల్టీస్టారర్ కోసం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.