నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై భారీ వసూళ్లను సాధిస్తూ, బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం విజయ విహారం చేస్తోంది. ఈ నేపధ్యంలో ఓవర్ సీస్ ఆడియన్స్ కి కృతజ్ఞతలు చెప్పడానికి బాలయ్య, డైరెక్టర్ క్రిష్, శ్రియ యు.యస్ లోని కొన్ని థియేటర్స్ ని సందర్శించారు. వెళ్లిన ప్రతి చోట బాలయ్యకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు.
న్యూ జెర్సీలో అయితే 100 కార్లుతో అభిమానులు జరిపిన భారీ ర్యాలీని చూసి చాలామంది నివ్వెరపోతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ కారు ర్యాలీ జరగడం బాలయ్యను సైతం పులకించిపోయేలా చేసిందని తెలుస్తోంది. అక్కడ ఓ చానెల్ ఇంటర్య్వూలో పాల్గొన్న బాలయ్య - ''అభిమానులే నా బలం. వారే నన్ను నడిపిస్తున్నారు. వేరే హీరోలకు అభిమానులు ఉంటారు కానీ నా అభిమానులులాగా రిజిస్టర్డ్ అభిమానులు కాదు. 4500పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. వారిని సంతోషపెట్టడానికి నా వంతుగా కృషి చేస్తూనే ఉంటాను. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత నేను చేయబోయే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మంచి పాత్రలు చేస్తాను'' అని చెప్పారు. ఇదిలా ఉంటే...
ఇప్పటివరకూ తెలుగు సినిమా స్ర్కీనింగ్ అవ్వని నైజీరియాలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' స్ర్కీనింగ్ అవ్వడం విశేషం. అక్కడి తెలుగువారి కోరిక మేరకు 'గౌతమిపుత్ర శాతకర్ణి' ని స్ర్కీనింగ్ చేసారట. ఆ స్ర్కీనింగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందట. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్, వసూళ్లను చూసి బాలయ్య అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ''సాహో శాతకర్ణి' అంటూ హల్ చల్ చేస్తున్నారు.