మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కోసం ఐశ్వర్యరాయ్ బచ్చన్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హల్ చల్ చేస్తున్న వార్తల ప్రకారం చిరు కోసం కాదట... మెగా తనయుడు రాంచరణ్ సరసన ఐశ్వర్యరాయ్ ని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతకీ రాంచరణ్ నటించబోయే ఏ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ ని తీసుకోబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే...
ఇటీవలే చరణ్ ని కలిసి మణిరత్నం ఓ స్టోరీ లైన్ వినిపించారట. ఈ స్టోరీ లైన్ నచ్చడంతో సుకుమార్ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తానని మాటిచ్చాడట రాంచరణ్. 'యోధా' టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారట. అరవింద్ స్వామి ఈ చిత్రంలో కీలక పాత్ర చేసే అవకాశముందట. ఈ సినిమా కోసమే ఐశ్వర్యరాయ్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరు', 'రావణ్' చిత్రాల్లో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించింది. రాంచరణ్ తో మణిరత్నం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో సినిమా చేయాలనుకుంటున్నారట. కాబట్టి ఐశ్వర్యరాయ్ అయితే బాగుంటుంది, బిజినెస్ పరంగా కూడా కలిసొస్తుందని భావిస్తున్నారట. మరి ఐశ్వర్య ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా వేచి చూద్దాం.