ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమా చేస్తున్న కొరటాల శివ, ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా, మెగాస్టార్ రాంచరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. కాగా రాంచరణ్ సినిమా కోసం కొరటాల శివ అందుకోబోతున్న పారితోషికం గురించి ఫిల్మ్ నగర్ లో తెగ చర్చించుకుంటున్నారు. ఆ విషయంలోకి వెళితే...
కొరటాల శివ, రాంచరణ్ కాంబినేషన్ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. ఇది రాంచరణ్ సొంత సంస్థ అని తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు రాంచరణ్. కాగా ఈ సినిమా కోసం 14కోట్లు పారితోషికం కొరటాల శివకు అందబోతోందని తెలుస్తోంది. ఇదేం కొరటాల శివ డిమాండ్ చేసి తీసుకుంటున్న పారితోషికం కాదు. రాంచరణ్ ఇంత పారితోషికం ఫిక్స్ చేసి, కొరటాలకు షాకిచ్చాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు 12కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట కొరటాల. అంతకంటే ఎక్కువే రాంచరణ్ సినిమాకి దక్కబోతోంది కాబట్టి, కొరటాల పారితోషికం విషయంలో ఫుల్ హ్యాపీ అయ్యుంటాడని ఊహించవచ్చు.