మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'ఫిదా' చిత్రం ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్ర నిర్మాతగా దిల్ రాజు భారీ లాభాలను చవిచూసారు. చిన్న సినిమాగా విడుదలై టాక్ పరంగా, వసూళ్ల పరంగా పెద్ద సినిమా అనిపించుకుంది. కాగా ఈ సినిమాపై బాలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి పడిందని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి దిల్ రాజుకు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. 'ఫిదా' హిందీ రీమేక్ రైట్స్ కి భారీ ఆఫర్స్ ఇస్తూ వస్తున్న ఫోన్ కాల్స్ అవి అని తెలుస్తోంది.
ఈ ఫోన్ కాల్స్ తర్వాత 'ఫిదా' ని హిందీలో నేనే ఎందుకు రీమేక్ చేయకూడదు అనే ఆలోచనలో పడిపోయాడట దిల్ రాజు. తెలంగాణా స్లాంగ్, కల్చర్ తెలుగు వెర్షన్ కి బాగా ప్లస్ అయ్యింది, హిందీలో ఈ సినిమాని రీమేక్ చేస్తే, పంజాబీ స్లాంగ్ ని, కల్చర్ ని వాడటం ప్లస్ అవుతుందని దిల్ రాజు అండ్ కో ఆలోచిస్తున్నారట. 'ఫిదా' లాంటి లైటర్ వీన్ స్టోరీస్ తో తెరకెక్కిన సినిమాలను బాలీవుడ్ ఆడియన్స్ బాగానే ఆస్వాదించారు. అందుకే 'ఫిదా' రీమేక్ తో బాలీవుడ్ అరంగేట్రం చేస్తే ఎలా ఉంటుందా అనే లెక్కలు వేసుకుంటున్నాడట దిల్ రాజు. మరి ఫైనల్ గా దిల్ రాజు తనే రంగంలోకి దిగుతాడో, లేక రీమేక్ రైట్స్ ఏ బాలీవుడ్ నిర్మాతకైనా కట్టబెడతాడో వేచి చూడాల్సిందే.