మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో సుకుమార్ దర్శకత్వం వహించిన 'రంగస్థలం' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రాంచరణ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, అదే స్థాయిలో ఆది పినిశెట్టికి కూడా మంచి పేరు వచ్చింది. విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. రాంచరణ్ నటనను ఎంత ఎంజాయ్ చేసారో, మెగా ఫ్యాన్స్ ఆది పినిశెట్టి నటనను కూడా మెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఆది పినిశెట్టి మాత్రం తనను సుకుమార్ నెగ్లెట్ చేస్తున్నాడని భావించాడట.
ఈ విషయం గురించి ఆది పినిశెట్టి నటించిన 'నీవెవరో' టీజర్ లాంఛ్ సందర్భంలో సుకుమార్ స్పందిస్తూ - ''రంగస్థలం షూటింగ్ చేయడం మొదలుపెట్టి, ఓ వారం పూర్తయిన తర్వాత ఆది పినిశెట్టి కి నాపై ఓ డౌట్ వచ్చింది. నేను తనను నెగ్లెట్ చేస్తున్నానని భావించాడు. నా అసిస్టెంట్స్ దగ్గర... తన నటన పట్ల నేను హ్యాపీగా లేనేమోనని అన్నాడట. అసలు విషయం ఏంటంటే... నేను ఆది నటన పట్ల చాలా ఇంప్రెస్ అయ్యాను. తన పెర్ ఫామెన్స్ చూసిన తర్వాత, తనకు ఏమీ చెప్పాల్సిన అవసరంలేదని, తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడని నమ్మకం కలిగింది. అందుకే తనకు ఏమీ చెప్పలేదు'' అని క్లారటీ ఇచ్చాడు సుకుమార్.