'ఫిదా', 'తొలిప్రేమ' సక్సెస్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ మంచి మలుపు తీసుకుంది. అతని మార్కెట్ రేంజ్ పెరిగింది. ప్రస్తుతం 'ఘాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం', అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో 'ఎఫ్ 2' చిత్రాలు చేస్తున్నాడు. అక్టోబర్ లో మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి వరుణ్ తేజ్ సమాయత్తమవుతున్నాడట. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...
నారా రోహిత్, శ్రీ విష్ణు కాంబినేషన్ లో తెరకెక్కిన 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రానికి దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర చెప్పిన స్టోరీ లైన్ కి ఫిదా అయిన వరుణ్ తేజ్ సింగిల్ సిట్టింగ్ లోనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపీ అచంట నిర్మించనున్నారు. ఇప్పటివరకూ ఎవ్వరూ టచ్ చేయని ఓ పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ 5కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. అయితే వరుణ్ డిమాండ్ చేసిన పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు అసలు వెనకడుగు వేయలేదని తెలుస్తోంది. 'ఫిదా', 'తొలిప్రేమ' చిత్రాలతో వరుణ్ తేజ్ కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. పైగా 'అంతరిక్షం' లాంటి భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు కాబట్టి, వరుణ్ రేంజ్ మారింది. అందుకే పారితోషికం డిమాండ్ చేస్తున్నా... వరుణ్ విషయంలో నిర్మాతలు వెనకడుగు వేయడంలేదని చెప్పొచ్చు.