'నా పేరు సూర్య' తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా ఇంకా ఆరంభమవ్వలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడని, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానుందనే వార్తలు ప్రచారమయ్యాయి. అయితే తాజా వార్తల ప్రకారం డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ లైన్ పట్ల అల్లు అర్జున్ అంత ఆసక్తిగా లేడట. ముఖ్యంగా ఈ స్ర్కిఫ్ట్ సెకండాఫ్ అల్లు అర్జున్ కి అసలు నచ్చలేదట. దాంతో సరైన స్ర్కిఫ్ట్ తో రావాలని, వచ్చే యేడాది సినిమా చేద్దామని చెప్పి ఇప్పటికైతే విక్రమ్ కుమార్ కి నో చెప్పేసాడట. ఆ వెంటనే మరో డైరెక్టర్ తో ముందు కెళ్లడానికి అల్లు అర్జున్ సమాయత్తమయ్యాడని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' లాంటి హిట్ చిత్రాలు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో మూడో సినిమాకి రంగం సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న థియేటర్స్ కి రానుంది. దీని తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి కథ రెడీ చేసాడట. త్వరలోనే అల్లు అర్జున్ కి కథ కూడా వినిపించబోతున్నాడట. కథ కుదిరితే... అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతుంది కాబట్టి, విక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా ఇప్పట్లో లేనట్టేనని ఫిక్స్ అయిపోవచ్చు.