బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా నన్ను చుట్టుకుంటివే... అంటూ అల్లు అర్జున్ 'అలా వైకుంఠపురంలో' సినిమాలో పూజా హెగ్డె ను చూసి పాడతాడు. నిజంగానే ఈ బుట్టబొమ్మ తన అందంతో, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. దాంతో అమ్మడికి ఆఫర్ల మీద ఆఫర్లు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దర్శక, నిర్మాతలు పూజా హెగ్డె డేట్స్ కోసం పరుగులు తీస్తున్నారు. ఆమె డిమాండ్ చేసినంత పారితోషికం ఇవ్వడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అందుకే ఎంచక్కా ఇంత పారితోషికం కావాల్సిందేనని డిమాండ్ చేస్తోందట. తను అడిగిన పారితోషికం ఇస్తే సరే... లేకపోతే ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పేస్తోందట.
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్', అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమా చేస్తోంది పూజాహెగ్డె. 'రాధేశ్యామ్' కి 2కోట్లు పారితోషికం కావాలని డిమాండ్ చేసిందట. నిర్మాతలు 2 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని తెలుస్తోంది. తాజాగా అమ్మడిని కోలీవుడ్ ఆఫర్ వరించిందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా, స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కోసం పూజా హెగ్డెని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. 2కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందట. పారితోషికం విషయంలో జరిగిన చర్చల్లో పూజా హెగ్డె ఏ మాత్రం తగ్గకుండా మునగచెట్టు ఎక్కి కూర్చుందట. 2కోట్లు ఇస్తే ఓకే... లేకపోతే నో అనేసిందట. దాంతో ఈ సినిమా నిర్మాతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.
సో... దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పూజా హెగ్డె ఉందని అర్ధం చేసుకోవచ్చు. డిమాండ్ ఉంది కాబట్టి చుక్కలు చూపిస్తోంది.