ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ లో మూడో సినిమాకి కూడా రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి కొరటాల దర్శకత్వం వహించబోవడంలేదు. నిర్మాతగా వ్యవహరించబోతున్నారని సమాచారమ్.
'గీత గోవిందం' చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ పరశురామ్ చెప్పిన ఓ స్టోరీ లైన్ మహేష్ బాబుకు నచ్చడంతో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ నేపధ్యంలో ఈ సినిమాని నిర్మించే అవకాశాన్ని దక్కించుకోవడానికి కొరటాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
సొంత బ్యానర్ ప్రారంభించి అప్ కమింగ్ దర్శకులతో సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో కొరటాల ఉన్నారట. కొరటాల బ్యానర్ లో నిర్మించబోయే సినిమాలకు అతని ఫ్రెండ్ సుధాకర్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారట. కాగా మహేష్ బాబు, పరశురామ్ సినిమా నిర్మించే అవకాశాన్ని దక్కించుకుంటే తమ బ్యానర్ వ్యాల్యూ పెరుగుతుందని భావిస్తున్న కొరటాల ఇందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారమ్. అదే కనుక జరిగితే కొరటాల బ్యానర్ కి మంచి గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు.